నాడు-నేడు పనుల్లో భూసేకరణ, ఇతర సమస్యలు వస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి: సీఎం జగన్

  • నాడు-నేడు పనులపై సీఎం సమీక్ష
  • వైద్యం, విద్యారంగంలో పనులపై అధికారులకు దిశానిర్దేశం
  • ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవలు అందించాలని సూచన
  • నిర్వహణ నిపుణులను తీసుకోవాలని ఆదేశం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైద్యం, విద్యా రంగంలో నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రమాణాలు ఉన్నతస్థాయిలో ఉండాలని నిర్దేశించారు.

నాణ్యమైన ప్రమాణాల కోసం ఎస్ఓపీలు రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఉత్తమ వైద్యం, నిర్వహణ, ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఏ ఆసుపత్రిలోనూ అపరిశుభ్ర వాతావరణం కనిపించరాదని అన్నారు. ఆసుపత్రుల నిర్వహణలో అనుభవమున్న నిపుణులను తీసుకోవాలని ఆదేశించారు. నాడు-నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని వివరించారు. లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూసేకరణ, ఇంకేమైనా ఇతర సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

Jagan
Nadu Nedu
Works
Tadepalli
Camp Office
YSRCP

More Telugu News